తాతా.. గిఫ్ట్‌ ఎలా ఇచ్చావు?

 అమరావతి: చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. హడావిడిగా ఆస్తుల ప్రకటనలో దాగివున్న లోగుట్టు స్పష్టమైంది. ఐటీ దాడుల నేపథ్యంలోనే ఆస్తుల డ్రామా తెరపైకి వచ్చిందని, నిర్వాణ హోల్డింగ్స్‌తో తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే ఈ పాట్లు అని ఆ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో సీఎం పదవి నుంచి దిగిపోగానే అప్పటి వరకు తన పేరు మీద లేని కోట్ల రూపాయల విలువైన షేర్లను మనవడు దేవాన్ష్కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. వరుసగా తొమ్మిదేళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా.. ఎప్పుడూ కూడా చంద్రబాబు తన పేరు మీద హెరిటేజ్‌ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదు. కానీ గురువారం 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్‌ షేర్లను ప్రకటిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.



2017–18లో దేవాన్ష్ పేరు మీద షేర్లు లేకపోగా ఇప్పుడు ప్రకటించిన జాబితాలో గ్రాండ్‌ పేరెంట్స్‌ 26,640 షేర్లు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేవాన్ష్ నాయనమ్మ భువనేశ్వరికి చెందిన హెరిటేజ్‌ షేర్లల్లో మార్పులు లేవు. ఈ షేర్లను తాత చంద్రబాబే ఇచ్చాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది ఒక్కటి చాలు ఏటా ఆస్తుల పేరిట చంద్రబాబు అండ్‌ కంపెనీ నడిపిస్తున్న డ్రామా తెలుసుకోవడానికి. కొన్న నాటి ఆస్తుల విలువను ప్రకటిస్తున్నామని చెబుతారు కానీ, కొత్తగా ఆస్తులు కొనకపోయినా ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతుండటం తల పండిన ఆర్థిక వేత్తలకు కూడా అర్థం కావడం లేదు. తనకు హెరిటేజ్‌ కంపెనీలో ఒక్క షేరు లేదంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు మనవడికి గిఫ్ట్‌ ఎలా ఇచ్చాడన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒక సీఎంగా ఉంటూ తాను షేర్లు కలిగిన కంపెనీకి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇవ్వడం ఖచ్చితంగా క్విడ్‌ ప్రోకో కిందకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.